25, మే 2011, బుధవారం

సుప్రసిద్ధ సంగీతదర్శకుడు గాలి పెంచల


గాలి పెంచల నరసింహారావు ఆ పేరు వింటే చాలామందికి గుర్తుకువచ్చేది "సీతారాముల కళ్యాణం చూతము రారండి" పాట. ఇంతటి గొప్ప పాటకు చాలా గొప్ప సంగీతదర్శకుడు గాలి పెంచల. ఆయన ఇంటిపేరు గాలి, ఆయన పేరు పెంచల నరసింహారావు. చాలామంది ఆయన ఇంటిపేరును గాలిపెంచల అనుకుంటారు. మాలపిల్ల (1938), కృష్ణప్రేమ (1943) వంటి చిత్రాలలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు, గాలి పెంచల సోదరుడు. గాలి పెంచల శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వ్యక్తి. ఆయన సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం సీతాకళ్యాణం (1934), ఇది దక్షిణభారతదేశంలో తయారైన మొట్టమొదటి చిత్రం. ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం ఎన్.ఏ.టి. వారి సీతారామకళ్యాణం (1961). ఆయన సంగీతం అందించిన మొదటి, చివరి చిత్రాలు రెండూ ఒకే కథ ఆధారంగా తయారవడం కాకతాళీయం. అగ్నిపరీక్ష (1951) చిత్రానికి సంగీతం అందించిన దాదాపు పదేళ్ళ తర్వాత ఆయన సీతారామకళ్యాణం చిత్రానికి సంగీతం అందించారు. ఘంటసాల సంగీతదర్శకుడిగా ఎదగడానికి ముఖ్య కారణం గాలి పెంచల. ఆయన సంగీతం అందించిన పల్నాటి యుద్ధం (1947), బాలరాజు (1948) చిత్రాలకు ఘంటసాలను సహాయకునిగా పెట్టుకున్నారు. బాలరాజు చిత్రంలో ఘంటసాల చేత కొన్ని పాటలకు స్వరరచనను చేయించారు. పల్నాటి యుద్ధం చిత్రంలో ఘంటసాల, కన్నాంబ చేత ఒక భక్తగీతం పాడించారు. ఆ పాట "తెరతీయగరాదా దేవా". ఆ పాటకు సంగీతం, సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటాయి. మాయాబజార్ (1957) చిత్రంలో ఘంటసాల స్వరపరిచిన "వివాహ భోజనంబు" పాటకు  గాలి పెంచల స్వరపరిచిన మాయాబజార్ (1936) చిత్రంలోని "వివాహ భోజనంబు" పాట ఆదర్శం. గాలి పెంచలకు "సంగీతోపాధ్యాయ" అని బిరుదు. 1903లో జన్మించిన గాలి పెంచల, 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964న మరణించారు.

ఇంకా ఎక్కువ సమాచారం కోసం ఈ కింద లింకును అనుసరించండి.

'సంగీతోపాధ్యాయ' గాలి పెంచల నరసింహారావు 47వ వర్థంతి సంధర్భంగా నా నివాళి.
పాట - ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా
గాయని - ఎస్.వరలక్ష్మి
సంగీతం - గాలి పెంచల నరసింహారావు
సాహిత్యం - సముద్రాల రాఘవాచార్య